వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. ఈత సరదా విషాదంగా మారకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పిల్లలు చెరువులు, కాలువలు, బావుల వద్దకు వెళ్లి ఈతకు దిగుతున్నారని, ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈత రాని వారు చెరువులు, బావులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పిల్లల ప్రాణాలకు ప్రమాదమని, తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే కోరారు.
