సుప్రీంకోర్టు Sonadhar Vs The State of Chhattisgarh కేసులో 2025 ఫిబ్రవరి 18న ఇచ్చిన ఆదేశాల మేరకు జీవిత ఖైదీల ప్రత్యేక రిమిషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత విధానాలు రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం G.O. Ms. No.126, హోం (సర్వీసెస్-V) శాఖ ద్వారా 2025 అక్టోబర్ 27న ప్రత్యేక మార్గదర్శకాలు మరియు కాలపట్టికలను జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1, జూన్ 1, అక్టోబర్ 1 తేదీలను కట్-ఆఫ్ తేదీలుగా నిర్ణయించి, సంవత్సరంలో మూడుసార్లు ప్రత్యేక రిమిషన్ పరిశీలన చేపట్టాలని నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా తెలంగాణ జైళ్ల శాఖ 2026 ఫిబ్రవరి 1 నాటికి ప్రత్యేక రిమిషన్కు అర్హత సాధించిన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. సంబంధిత జైళ్ల సూపరింటెండెంట్లు సిద్ధం చేసిన ఈ జాబితాను ఐజీలు, డీఐజీలతో కూడిన అంతర్గత కమిటీ పరిశీలించి, అనంతరం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సభ్యులుగా ఉన్న స్టాండింగ్ కమిటీకి పంపించారు.
తదుపరి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర గవర్నర్ అనుమతికి పంపించగా, ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రత్యేక రిమిషన్ ప్రతిపాదనలను ఆమోదించారు.
ఈ సమావేశానికి తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఎన్. మురళీ బాబు హాజరయ్యారు.
ఆమోదిత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 92 మంది జీవిత ఖైదీలు ప్రత్యేక రిమిషన్ పరిశీలనకు అర్హులుగా గుర్తించబడ్డారు. వీరిలో 86 మంది పురుష ఖైదీలు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
ఇంతకుముందు ప్రభుత్వం G.O. Ms. No.37, హోం (సర్వీసెస్-V) శాఖ, తేదీ 02-07-2024 ద్వారా 213 మంది ఖైదీలకు ప్రత్యేక రిమిషన్ మంజూరు చేసింది. అందులో 178 మంది పురుషులు, 35 మంది మహిళా ఖైదీలు ఉండగా, వారిని విధివిధానాల ప్రకారం విడుదల చేశారు.
మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, అర్హత ఆధారంగా ఖైదీల విడుదల చేపట్టడం ద్వారా జైళ్లలో రద్దీ తగ్గడంతో పాటు మానవీయ విలువలను పరిరక్షించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
