సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎండలు, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కిట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పంపిణీ చేశారు. మొత్తం 9 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ఎండలు, వర్షాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం, భద్రత కూడా ముఖ్యమని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణలో ట్రాఫిక్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల సురక్షిత ప్రయాణం కోసం సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని, విధి నిర్వహణలో సిబ్బంది ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక కిట్లు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
ట్రాఫిక్ సిబ్బందికి అందజేసిన కిట్లలో క్యాప్, కూలింగ్ గ్లాసెస్, రెండు రిఫ్లెక్టివ్ జాకెట్లు, రెయిన్ కోట్, వాటర్ బాటిల్, లైటింగ్ బ్యాటన్, షోల్డర్ లైట్తో కూడిన బ్యాగ్ తదితర సామగ్రి ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




