Breaking News

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు.

ఒంగోలు జిల్లా పొర్సిపాడు మండలం మ్యాదరమెట్ల గ్రామానికి చెందిన చైతన్య మణికంఠ ప్రస్తుతం వేములవాడ తేలుకుంట ఇంద్రనగర్‌లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా బోయినపల్లి, జమ్మికుంట ప్రాంతాల్లో దేవాలయ చోరీ కేసుల్లో జైలుశిక్ష అనుభవించినప్పటికీ అతనిలో మార్పు రాలేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తన బంధువులైన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీనుతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. 2026 జనవరి 21న తంగళ్లపల్లి గ్రామానికి వెళ్లి రెక్కీ నిర్వహించిన ముగ్గురు, మరుసటి రోజు తెల్లవారుజామున దేవాలయానికి చేరుకుని యాగశాల తాళం బండరాయితో పగులగొట్టి అందులో ఉన్న పంచలోహ గరుడ వాహనాన్ని అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.

డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్.. బాధ్యతాయుత పోలీసింగ్‌పై దిశానిర్దేశం

ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 19న వాహన తనిఖీల సందర్భంగా పాత నేరస్థుడైన చైతన్య మణికంఠపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా, తాను మరో ఇద్దరితో కలిసి చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఎస్సై ఉపేంద్ర చారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్‌లను సీఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *