సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ “స్పార్క్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల విద్యా ప్రగతిని ప్రోత్సహించేందుకు “స్పార్క్” (Supporting Potential Academic Rise for Khaki Kids) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్న వయస్సులోనే పిల్లల ప్రతిభను సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.
పదవ తరగతి, ఇంటర్ విద్యార్థుల జీవితంలో కీలకమైన దశలని, ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. సెల్ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ అవసరమని, పిల్లలను సమతుల్య విధానంలో పెంచాలని సూచించారు.
అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాల్లో కూడా ముందుండాలని సూచించారు. నిరంతర కృషి, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. పోలీసు ఉద్యోగుల సేవల వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఆ త్యాగాలను పిల్లలు గుర్తించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, సైదా నాయక్, ఆర్డీఎస్పీ నరేందర్, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
