హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు పట్టుబడ్డారు. ఈ నెల 15, 16 తేదీల్లో నగరవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 474 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు.
పట్టుబడిన వారిలో 417 మంది ద్విచక్ర వాహనదారులు, 24 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, 33 మంది ఫోర్ వీలర్ మరియు ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 30 నుంచి 50 BAC స్థాయిలో 103 కేసులు నమోదు కాగా, 51 నుంచి 100 BAC స్థాయిలో 188 కేసులు నమోదయ్యాయి. 101 నుంచి 150 BACలో 100 మంది, 151 నుంచి 200 BACలో 44 మంది, 201 నుంచి 250 BACలో 19 మంది, 251 నుంచి 300 BACలో 8 మంది పట్టుబడ్డారు. 300కు పైగా BAC నమోదైన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
