
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా,రోడ్డు ప్రమాదాల నియంత్రణ,ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపు కోసం “Arrive Alive” కార్యక్రమం ఏప్రిల్ 13–18 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం,ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యం గ్రామ పరిధిలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించడం, రోడ్డుకు ఇరువైపులా చెట్లు లేదా అడ్డంకులు ఉండి వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాలను గుర్తించడం, రోడ్లపై గుంతలు, సరిగా కనిపించని మలుపులు, స్ట్రీట్ లైట్లు లేని ప్రాంతాలు వంటి ప్రమాదకర పరిస్థితులను గుర్తించి వాటి నివారణకు సంబంధిత అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టడం. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతంగా వాహనాలు నడిపేలా ప్రోత్సహించడం కూడా ఈ కమిటీల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. గ్రామస్థులు,యువత,స్థానిక నాయకులు,విద్యార్థులు కలిసి ఈ కమిటీలలో భాగస్వాములై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సహకరించాల్సిందిగా ఈసందర్భంగా కోరారు. అదనపు ఎస్పీ వెంట ఎస్.ఐ అశోక్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

