సంగారెడ్డి, ఏప్రిల్ 02: హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే శోభాయాత్రల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సదాశివపేటలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సదాశివపేట పట్టణంలో జరిగే హనుమాన్ జయంతి శోభాయాత్ర మార్గాలను పరిశీలించి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలు నిర్వహించేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దాలతో డీజేలు వినియోగించకూడదని సూచించారు. ఇతర మతాల భావాలను దెబ్బతీసేలా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు చేయవద్దని హెచ్చరించారు.
ర్యాలీలో పాల్గొనే వారు శాంతియుతంగా, సహనంతో ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రూమర్లను నమ్మవద్దని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా రూమర్లు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సదాశివపేట ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
