ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 02: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.
కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో నేర నియంత్రణ కోసం విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ సిబ్బందికి సూచించారు. రౌడీ షీటర్లపై కచ్చితమైన నిఘా ఉంచాలని తెలిపారు.
🚨 అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు
పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా పదిర వద్ద ఉన్న ఇసుక రీచ్ను తనిఖీ చేసి, తవ్వకాల విధానం, రవాణా అనుమతులు, రికార్డులను పరిశీలించారు. అక్రమంగా ఇసుక రవాణా లేదా నిల్వలు ఉంటే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
📹 సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం
నేరాల నియంత్రణకు, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు కీలకమని పేర్కొన్న ఎస్పీ, గ్రామాలు, వ్యాపార ప్రాంతాల్లో విస్తృతంగా వాటి ఏర్పాటు కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో ఎస్పీ వెంట ఎస్.ఐ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.
