సంగారెడ్డి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్, కార్యాలయ ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు.
స్టేషన్ రికార్డులు అయిన జనరల్ డైరీ, హిస్టరీ షీట్లు, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించిన ఎస్పీ, అన్ని రికార్డులు తాజా సమాచారంతో అప్డేట్గా ఉండాలని ఆదేశించారు. పెండింగ్ మరియు దర్యాప్తులో ఉన్న కేసులపై సమగ్ర వివరాలు తెలుసుకుని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎస్హెచ్ఓకు ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం “అరైవ్ అలైవ్” వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తరచూ వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, నాకాబంది వంటి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
తదుపరి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
