
వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు నల్లగొండలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, IPS ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు స్వయంగా మట్టి కుండలలోని చల్లని తాగునీటిని ప్రజలకు అందించారు. ఎండాకాలంలో రహదారులపై ప్రయాణించే ప్రజలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడకుండా వారికి చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నందున తరచుగా నీరు తాగడం, అవసరమైతే నీడలో విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజల సేవే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా రోజంతా ప్రయాణికులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా మట్టి కుండలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిర్వహణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,ఆర్.ఐలు సంతోష్, శ్రీను,ఆర్.ఎస్ఐ నాగరాజు,హెడ్ కానిస్టేబుల్ నాగరాజు,పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

