Breaking News

గీతాంజలి హై స్కూల్‌లో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని గీతాంజలి హై స్కూల్‌లో విద్యార్థిని, విద్యార్థులకు మహిళల భద్రత, షీ టీం సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. షీ టీం ద్వారా మహిళలు, బాలికల ఫిర్యాదులను పూర్తిగా గోప్యంగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. షీ టీంను నేరుగా 8712526935 నంబర్‌లో సంప్రదించవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100/112 సేవలను వినియోగించాలని సూచించారు.

సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర వేదికలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ మోసాలు, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ (AHTU) సిబ్బంది మానవ అక్రమ రవాణా నిరోధక చర్యలపై వివరించగా, భరోసా కేంద్రం ప్రతినిధులు లైంగిక వేధింపులు, బాలలపై నేరాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక సహాయ సేవల గురించి వివరించారు.

మహిళలు, బాలికల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైనా వెంటనే షీ టీం లేదా సమీప పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో గీతాంజలి హై స్కూల్ కరస్పాండెంట్ కె. రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, అధ్యాపక బృందం, సుమారు 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారానికి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చిన మహిళా భద్రత విభాగం

షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, ప్రియాంక, ఏహెచ్‌టీయూ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, సుప్రజ, భరోసా కేంద్రం సెంట్రల్ కోఆర్డినేటర్ జోష్ణ, లీగల్ అడ్వైజర్ శ్వేత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *