మహబూబ్నగర్: “మీ డబ్బులు డబుల్ అవుతాయి”, “సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ”, “100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్” వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రజలకు హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అవలంబిస్తూ అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పేరుతో నకిలీ పెట్టుబడి పథకాలు, అధిక లాభాలు వస్తాయని చెప్పే స్కీములు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేసే ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రకటనలను చూసి ఎలాంటి ధృవీకరణ లేకుండా పెట్టుబడులు పెట్టవద్దని సూచించిన ఎస్పీ, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ నిజమైనదేనా, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా అనే విషయాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని చెప్పారు. తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు అవుతాయని హామీ ఇచ్చే పథకాల విషయంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.
జిల్లాలో సైబర్ నేరాల నివారణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతరం సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద పెట్టుబడి లింకులు, సోషల్ మీడియా పోస్టులు లేదా ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు పెట్టాలని కోరితే వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే, అధికారిక ధృవీకరణ లేని లింకులను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రజలను కోరారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ మోసాలను అరికట్టడంలో అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించి ఇతరులను కూడా చైతన్యపరచాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
