సంగారెడ్డి జిల్లాలో సోషల్ మీడియా వేదికగా నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ ప్రకటనలు రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గ్యాడ్జెట్లు, లగ్జరీ వస్తువులను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు చూపిస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులు ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువులు అందకపోవడంతో పాటు వారి బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు కూడా దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రజలు అసాధారణ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, కాష్ ఆన్ డెలివరీ సౌకర్యం లేకపోవడం, కొత్తగా సృష్టించిన సోషల్ మీడియా పేజీలు, అనుమానాస్పద యూఆర్ఎల్స్, నకిలీ వెబ్సైట్లు, తప్పుడు రివ్యూలు, ముందస్తు చెల్లింపుల కోసం ఒత్తిడి చేయడం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆన్లైన్ చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్, యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించాలని, పేజీ హిస్టరీ, ఫాలోవర్లు, రివ్యూలను చెక్ చేయాలని తెలిపారు. తెలియని స్పాన్సర్డ్ యాడ్స్పై క్లిక్ చేయకుండా సురక్షిత పేమెంట్ విధానాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అలాగే ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ పంచుకోవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా National Cyber Crime Portal లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
