Breaking News

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం.. నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అప్రమత్తతతో బయటపెట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా సత్కరించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు.

చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు, 16 ఏళ్ల నమాన్ తివారీ గమనించాడు. గతంలో కూడా ఇదే విధంగా సిలిండర్ రెండు కిలోలు తక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్ కేవలం 28 కిలోలు మాత్రమే ఉండటంతో వారికి అనుమానం వచ్చింది.

తండ్రీకొడుకులు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్వయంగా ఆరా తీశారు. ఈ క్రమంలో సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ఉద్యోగులు జుమేరాత్ బజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు, వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

దీంతో గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. సాయి కుమార్, వినీత్ కుమార్, పూస గణేష్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 2 కమర్షియల్, 7 డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లు మరియు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ పెట్టుబడి స్కామ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఉక్కుపాదం.. 184 సోషల్ మీడియా ప్రొఫైల్స్ తొలగింపు

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, యూనిఫాం లేని పోలీసుల్లా వ్యవహరించి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించిన తండ్రీకొడుకులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. ప్రతి పౌరుడు ఇలాంటి చైతన్యంతో స్పందిస్తే నేరరహిత సమాజం నిర్మించవచ్చన్నారు.

వినియోగదారులు తమకు అందే వస్తువుల నాణ్యత, పరిమాణంపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా మోసం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *