సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటనను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మంగళవారం జరగనున్న ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలోని ఏర్పాట్లను, ముఖ్యంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, వీఐపీ మువ్మెంట్ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై కఠిన నిఘా ఉంచాలని, ప్రతి బిందువులో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సి.ఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐలు మధుకర్, రమేష్, ఎస్.ఐ అనిల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
