Breaking News

నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ – 558 షాపులపై దాడులు, 5 వేల మంది పోలీసులతో భారీ డ్రైవ్

వార్త:
విద్యార్థులను డ్రగ్స్, పొగాకు వంటి వ్యసనాల నుంచి రక్షించాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

శనివారం నిర్వహించిన ఈ డ్రైవ్‌లో సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొని, విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న 558 దుకాణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, లా అండ్ ఆర్డర్ మరియు రిజర్వ్ పోలీసులు కలిసి ఈ చర్యల్లో పాల్గొన్నారు.

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, పొగాకులోని నికోటిన్ అలవాటు మాదకద్రవ్యాల వైపు దారితీసే తొలి మెట్టుగా మారుతోంది. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం విద్యార్థులను ప్రమాదకరమైన అలవాట్ల వైపు నెడుతుందని గుర్తించిన పోలీసులు, ఈ సమస్యను ప్రారంభ దశలోనే అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

COTPA Act 2003 సెక్షన్ 6(b) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు విక్రయం నిషేధం. అలాగే, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం Juvenile Justice Act సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హ నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సీపీ సజ్జనర్ చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లెపల్లి, గోషామహాల్ వంటి ప్రాంతాల్లో స్వయంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

“అరైవ్ అలైవ్ క్యాంపెయిన్”లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన – ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయెల్ డేవిస్

గోషామహల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మైనర్లకు పొగాకు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో పలువురు దుకాణదారులు చిన్నారులకు పొగాకు విక్రయిస్తున్నట్లు తేలిందని తెలిపారు.

విద్యాసంస్థల పరిసరాల్లో ఇలాంటి నేరాలను అరికట్టేందుకు హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సమస్యను అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సీపీ పిలుపునిచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే డయల్ 100 లేదా హెచ్-న్యూ నెంబర్ 8712661601కు సమాచారం అందించాలని కోరారు.

ఈ ఆపరేషన్‌లో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *