వార్త:
మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు తప్పవని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 20 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారిని కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు.
కోర్టు విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ప్రవీణ్ శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. మొత్తం 18 మందికి జైలు శిక్షలు విధించగా, మిగిలిన వారికి జరిమానాలు విధించారు.
విధించిన శిక్షలు ఇలా ఉన్నాయి:
- 9 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒక్కొక్కరికి ₹4,000 జరిమానా
- 7 మందికి రెండు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి ₹5,000 జరిమానా
- 2 మందికి మూడు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి ₹5,000 జరిమానా
- 2 మందికి ఒక్కొక్కరికి ₹10,000 జరిమానా
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపడుతున్న “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవించి కుటుంబాలు నష్టపోవచ్చని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అలాంటి కేసులు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
