వార్త:
హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బషీర్ బాగ్లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో ఆయనను ప్రత్యేకంగా పిలిపించి శాలువా కప్పి సన్మానించి నగదు రివార్డు అందజేశారు.
ఈ నెల 14న అంబర్పేట ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద బస్సు దిగుతున్న సమయంలో రాముడి మెడలోని బంగారు గొలుసును దోచుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా, తన వయసును లెక్కచేయకుండా ధైర్యంగా ప్రతిఘటించి నిందితుడిని పట్టుకున్నారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో అంబర్పేట పెట్రోల్ కార్ సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ మన్నన్గా గుర్తించారు. అతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్లు వెల్లడైంది. అదేవిధంగా హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉండగా, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని అనుచరులు కోటేష్, మల్లేష్ పరారీలో ఉన్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన అంబర్పేట ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్ రెడ్డి, భరత్ కుమార్ల పనితీరును కూడా సీపీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ “ఒకసారి సైనికుడు… ఎప్పుడూ సైనికుడే” అని రాముడి ధైర్యాన్ని ప్రశంసించారు. భయపడకుండా నేరస్తుడిని ఎదుర్కొన్న ఆయన సాహసం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో నేరాల నియంత్రణకు ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్లా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ డీసీపీ సిహెచ్ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
