
కల్తీ నివారణ కోసం బేగం బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, అక్కడి పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా కార్యాలయంలోని రిసిప్షన్, ఇన్స్పెక్టర్, ఎస్సైల గదులతో పాటు లాకప్లు, మహిళా సిబ్బంది విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు హెచ్-ఫాస్ట్ బృందాలు నగరవ్యాప్తంగా 117 కేసులు నమోదు చేసి, సుమారు 129.34 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యంత తక్కువ సమయంలోనే ఈ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇది సిబ్బంది సామూహిక కృషి ఫలితమేనని కొనియాడారు. “ఆహార కల్తీ అనేది సమాజానికి పట్టిన చీడ పురుగు. ఇది పౌరుల ఆయుష్షును హరిస్తోంది. హైదరాబాద్ను కల్తీ రహితంగా మార్చే ప్రక్రియను ఒక పవిత్రమైన మహా యజ్ఞంలా భావించి, సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 108 మంది పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇదే సమయంలో సిబ్బందికి కీలక సూచనలు చేస్తూ.ఎవరూ కూడా అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీపై జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్ హెడ్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు, వివిధ జోన్ల ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

