
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, సంగారెడ్డి పట్టణంలోని నల్సాబ్గడ్డలో ఏర్పాటు చేసిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ మరియు సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, సురక్షిత ప్రయాణం ఎలా చేయాలో వివరించారు. రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యువత రోడ్డు ప్రమాదాలపై వెంటనే స్పందించి సమీప పోలీస్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్ రామునాయుడు, గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

