
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ జోన్ పరిధిలోని మాతృశ్రీ కాలేజ్, సంతోష్నగర్లో జాతీయ రహదారి భద్రతా మాసం–2026 సందర్భంగా “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మరియు ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ శాఖ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయెల్ డేవిస్, ఐపీఎస్, హాజరయ్యారు. అలాగే ట్రాఫిక్-3 అదనపు డీసీపీ రామ్దాస్ తేజావత్, ట్రాఫిక్ చాంద్రాయణగుట్ట ఏసీపీ చంద్ర కుమార్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ మలక్పేట్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ సంతోష్నగర్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ సైదాబాద్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ చాంద్రాయణగుట్ట పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. విద్యార్థులకు హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడ్ చేయకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో వివరించారు. ఇంటరాక్టివ్ సెషన్లో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైన్స్, పాదచారుల భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే వారికి గుడ్ సమారిటన్ చట్టం రక్షణ కల్పిస్తుందని అధికారులు తెలిపారు. “Arrive Alive” ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

