
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లోని యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని,పట్టణ పరిధిలో అర్ధరాత్రి సమయంలో రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనపడిన అత్యవసర సమయంలో డయల్ 112కు సమాచారం అందించాలని, కాలనీల్లో స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని,ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
