
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ గూడూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ గదులు, రికార్డుల నిర్వహణ, పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్లో సిబ్బంది సంఖ్య, వారి విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి గురించి గూడూరు గిరిధర్ ను ఎస్సైని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, గ్రామపంచాయతీల వివరాలు, అక్కడ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం ఎస్పీ ఎంపిక చేసిన గ్రామపంచాయతీ అయిన పోనుగోడు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో హెల్మెట్ వినియోగం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు మరియు పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాలతో హెల్మెట్ వినియోగం కచ్చితంగా అమలవుతున్న తీరు, గ్రామమంతా సీసీ కెమెరాల కవరేజీలో ఉండడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గ్రామ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు మరియు పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే గ్రామాలను నేర రహితంగా, సురక్షితంగా మార్చుకోవచ్చని ఎస్పీ తెలిపారు.

