Breaking News

వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం: V. C. Sajjanar

హైదరాబాద్: వేసవి సెలవుల సందర్భంగా పిల్లలపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ సూచించారు. సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల అధిక వినియోగం పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకరమవుతుందని ఆయన హెచ్చరించారు.

పూర్వం వేసవి సెలవులు అంటే అమ్మమ్మ ఊరు, ప్రకృతి సోయగాలు, ఆటపాటలతో నిండిన రోజులు గుర్తుకొస్తాయని, కానీ నేటి పిల్లల బాల్యం మొబైల్ ఫోన్ తెరలకే పరిమితమవుతుండటం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలతో గడపడానికి సమయం కేటాయించకపోవడం వల్లే వారు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతున్నారని పేర్కొన్నారు. దీని ప్రభావంగా పిల్లలు ఒంటరితనం మరియు మానసిక సమస్యలకు గురవుతున్నారని చెప్పారు.

సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెరగడం ద్వారా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా రీల్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడటం వల్ల నిద్రాహారాలు మానేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని తెలిపారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపానికి గురై ఇల్లు వదిలి వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని, ఇవి కుటుంబాల్లో తీవ్ర మనోవేదనకు దారితీస్తున్నాయని అన్నారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే తల్లిదండ్రుల సమయమే గొప్ప కానుక అని సూచించారు. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాల సమయంలో వారికి ధైర్యం చెప్పుతూ సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *