హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్వే ట్రాఫిక్ ట్రయల్ రన్ను నిర్వహించారు.
ఈ ట్రయల్ రన్ను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయల్ డెవిస్తో కలిసి కేబీఆర్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ మరియు అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ నిర్వహించినట్లు సీపీ తెలిపారు.
ఈ వన్వే ట్రయల్ రన్ ఆదివారం ఒక్కరోజే నిర్వహించగా, రేపటి నుంచి ట్రాఫిక్ యథావిధిగా కొనసాగనుంది. ట్రయల్ సమయంలో గమనించిన అంశాలను విశ్లేషించి నివేదికను GHMCకు పంపనున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి మళ్లీ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అభివృద్ధి పనుల కారణంగా కలిగే అసౌకర్యానికి పోలీసులు మరియు ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు సహకరించాలని కోరారు.
