కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్, గుండ్రాతిమడుగులో శుక్రవారం షీ టీం, భరోసా, ఏహెచ్టీయూ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ సునంద మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణ కోసం షీ టీం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. మహిళలపై, చిన్నారులపై అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, స్ట్రీట్ హరాస్మెంట్, ఫాలో కావడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్లు పంపడం వంటి చర్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
18 సంవత్సరాలు నిండని బాలలపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు విధించబడతాయని వివరించారు. మహిళలు, విద్యార్థినులు ఫిర్యాదుల కోసం మహబూబాబాద్ షీ టీం నెంబర్ 8712656935కు సంప్రదించాలని సూచించారు. చైల్డ్ లేబర్, చైల్డ్ బేగర్స్, మిస్సింగ్ పిల్లలు, స్కూల్ డ్రాప్ అవుట్స్ వంటి అంశాలపై 1098కు కాల్ చేయవచ్చన్నారు. ఆన్లైన్ మోసాలు లేదా వేధింపులపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

అదేవిధంగా పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె. జానయ్య, అధ్యాపక సిబ్బంది, సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, అరుణ, పార్వతి, రమేష్, ఏహెచ్టీయూ యూనిట్ ఉమెన్ కానిస్టేబుల్ సుప్రజ, భరోసా సిబ్బంది జ్యోత్స్న, రేణుక తదితరులు హాజరయ్యారు.
