జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో శుక్రవారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ Mahesh B. Gite ఆదేశాల మేరకు జరిగిన ఈ పరేడ్లో ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులు, హోం గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
పరేడ్ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్లను అదనపు ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట నడక లేదా వ్యాయామం చేయాలని, సాధ్యమైనంతవరకు బయట ఆహారాన్ని నివారించాలని సూచించారు. రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని కూడా తెలిపారు.
వీక్లీ పరేడ్ల ద్వారా సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందడంతో పాటు శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని అన్నారు. విధులు క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను కలుసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐలు, సి.ఐలు కృష్ణ, మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐలు కిరణ్ కుమార్, సాయి కిరణ్, జునైద్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
