జిల్లా షీ టీమ్ చర్యలు – సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచన
జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతిరోజూ విద్యాసంస్థలు మరియు మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమాల్లో భాగంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో చట్టం, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, అలాగే షీ టీమ్ సేవల గురించి విద్యార్థులకు, మహిళలకు వివరణాత్మకంగా తెలియజేస్తున్నారు.
ఈరోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించింది. వేధింపులకు గురైన వారు నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదని, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

