
తమ్ముడి చేతిలో తగలబడిన అన్న ఇంటి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లక్ష్మణ చారి తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బాల నరసయ్య తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి తన తమ్ముడు మల్లయ్యతో భూవివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మల్లయ్య, 2019 జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో నరసయ్య ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనపై నరసయ్య తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ శేఖర్ కేసు నమోదు చేసి మల్లయ్యను రిమాండ్కు తరలించారు. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసును ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీ ప్రసాద్ వాదించగా కోర్టు మానిటరింగ్ ఎస్సై నాయుడు నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్,కానిస్టేబుల్లు నవీన్, రాజేందర్ లు ఎనిమిది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు.
