రూ.25 వేల లంచం డిమాండ్ కేసులో సర్వేయర్తో పాటు ఇద్దరు ప్రైవేట్ అసిస్టెంట్లు అరెస్ట్
కరీంనగర్: భూ సర్వే నిర్వహించి అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో సర్వేయర్తో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు ప్రైవేట్ అసిస్టెంట్లను కూడా అరెస్ట్ చేశారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి అమ్మంగుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమికి సర్వే నిర్వహించి అధికారిక అనుకూలత కల్పించేందుకు రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో 2026 మే 23న రూ.5,000ను యూపీఐ ద్వారా స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు.
అనంతరం జూన్ 2న మరో రూ.10,000ను నగదు రూపంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ వంగా విహిత్ రెడ్డి ద్వారా తీసుకున్నాడు. మిగిలిన రూ.10,000 లంచం మొత్తాన్ని జూన్ 5న మరో ప్రైవేట్ అసిస్టెంట్ తీగల రాజేష్ ద్వారా స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
తీగల రాజేష్ వద్ద నుంచి రూ.10,000 లంచం నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు నిర్ధారించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎక్కలదేవి కుమారస్వామితో పాటు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే 9440446106 వాట్సాప్ నంబర్, ఫేస్బుక్లో Telangana ACB, ఎక్స్ (ట్విటర్)లో @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
