జిల్లాలో గంజాయి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సిరిసిల్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల, తంగళ్లపల్లి ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో కిరాణా షాపులు, పాన్ దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తోందని తెలిపారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సరఫరా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ ప్రాంతాల్లో తరచూ నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు.
అదేవిధంగా యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
