హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని నారాయణగూడ పోలీసులు ఇద్దరు కిరాతక అటెన్షన్ డైవర్షన్ నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమాయకులను మోసం చేసి నగదు దోచుకుంటున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు మహమ్మద్ సల్మాన్ (26), అజాన్ తౌఖీల్ ఖాన్ (19)గా గుర్తించారు. వీరిద్దరూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మోసం చేసే విధానం ఇలా…
ఏటీఎం సెంటర్లకు నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి, “గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం” అని నమ్మబలుకుతారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న తర్వాత, అసలు ట్రాన్సాక్షన్ చేయకుండా “పేమెంట్ సక్సెస్” స్క్రీన్ చూపించి అక్కడి నుంచి పరారవుతారు.
ఈ నిందితులు నారాయణగూడ, మాసాబ్ ట్యాంక్, సుల్తాన్బజార్, ఐఎస్ సదన్, డోమల్గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు కేసుల్లో పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
కేసు వివరాలు…
ఏప్రిల్ 13న ఆదిత్య అగర్వాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అతను రూ.20,000 నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లగా నిందితులు ఇదే పద్ధతిలో మోసం చేసినట్లు పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆధునిక సాంకేతికత సహాయంతో ఏప్రిల్ 16న మలక్పేట్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు. విచారణలో వీరు చేసిన నేరాలను అంగీకరించినట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్లో నారాయణగూడ ఎస్హెచ్వో సైదేశ్వర్, డీఐ అభిలాష్, డీఎస్ఐ నాగరాజు తదితరులు కీలక పాత్ర పోషించారు. పోలీసుల పనితీరును ఖైరతాబాద్ డీసీపీ అభినందించి, బృందాన్ని పురస్కరించారు.
