హైదరాబాద్: చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు మరియు వీధి వ్యాపారుల నుండి అక్రమంగా మామూళ్లు వసూలు చేస్తున్న వ్యక్తులకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే నాయకత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ మరియు చార్మినార్ ఎస్హెచ్ఓ రాంబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అక్రమ వసూళ్లు లేదా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రౌడీ షీట్లు తెరవడమే కాకుండా, కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని, ఇది తుది హెచ్చరిక అని తెలిపారు. నేర ప్రవృత్తిని వీడి గౌరవప్రదమైన జీవనోపాధిని ఎంచుకోవడానికి ఇదొక చివరి అవకాశమని సూచించారు.
అదేవిధంగా దుకాణదారులు మరియు వ్యాపారులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, రోడ్ల ఆక్రమణలు చేయకుండా ట్రాఫిక్కు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన చార్మినార్ ప్రతిష్టను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
అక్రమ వసూళ్ల పట్ల చార్మినార్ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
