హైదరాబాద్, ఏప్రిల్ 15, 2026: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ప్రచారంలో భాగంగా, హైదరాబాద్లోని విజయ్నగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నతనం నుండే రోడ్డు భద్రతా నియమాలపై బాధ్యతాయుతమైన అలవాట్లను పెంపొందించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పాదచారుల క్రాసింగ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, హెల్మెట్ మరియు సీటు బెల్టుల ఆవశ్యకతపై ప్రయోగాత్మక ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయెల్ డెవిస్ మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి విద్యార్థులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తల్లిదండ్రులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో పిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని కోరారు. గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే ‘గుడ్ సమారిటన్’ విధానం గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ట్రాఫిక్-II) సి. వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ (ట్రాఫిక్ గోల్కొండ జోన్) డి. ధనలక్ష్మి తో పాటు టోలిచౌకి, ఆసిఫ్ నగర్, కుల్సుంపురా, గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు సబ్-ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
