మహబూబాబాద్, ఏప్రిల్ 15, 2026: మహబూబాబాద్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తమ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ పిల్లల భద్రత ప్రతి తల్లిదండ్రి యొక్క ప్రథమ బాధ్యత అని తెలిపారు. చిన్న దూరం ప్రయాణం అయినా నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని, హెల్మెట్ ఒక్కటే ప్రాణాలను రక్షించే ముఖ్య భద్రతా సాధనం అని పేర్కొన్నారు.
పిల్లలను ద్విచక్ర వాహనాలపై ముందుగా లేదా వెనుక కూర్చోబెట్టి ప్రయాణించే సమయంలో వారికి సరిపోయే సైజు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టాలని సూచించారు. హెల్మెట్ను సరిగ్గా బిగించి ధరించకపోతే దాని ప్రయోజనం ఉండదని, సరైన విధంగా ధరించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.
అలాగే, ఒక కుటుంబం మాత్రమే కాకుండా సమాజం మొత్తం ఈ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించమని గుర్తు చేయడం ద్వారా మంచి మార్పు తీసుకురాగలరని, రోడ్డు భద్రత కుటుంబ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని వివరించారు.
వేగ పరిమితులు పాటించడం, ట్రిపుల్ రైడింగ్ నివారించడం, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం వంటి అంశాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని తెలిపారు. ప్రతి తల్లిదండ్రి తమకు మాత్రమే కాకుండా తమ పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టి ప్రయాణించడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా నిలవాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని గుర్తుంచుకుని, హెల్మెట్ వినియోగాన్ని కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
