
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, ప్రజా భద్రత, నేర నియంత్రణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటు చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన భద్రతా చర్య అని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అధిక వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. యువత మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ రాము,నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణు, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

