హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారంపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని నగర పోలీసు కమిషనర్ V. C. Sajjanar హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, కల్తీ అనేది వ్యాపారం కాదని సమాజంపై జరిగే దాడి అని ఆయన స్పష్టం చేశారు.
బషీర్బాగ్లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘హెచ్-ఫాస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర రంగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెలలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాపారులకు సూచించారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా Food Safety and Standards Authority of India లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు డీసీపీ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
