
నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నేరుగా బాధితుల వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఓర్పుతో విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 40 మంది పిర్యాదుదారులు తమ వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇతర ఫిర్యాదులను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గ్రీవెన్స్ డే కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ఉన్నతాధికారులను కలుసుకొని తమ సమస్యలను వెల్లడించుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ సూచించారు.
