పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, మంగళవారం చార్మినార్ వద్ద ఉన్న చారిత్రక మక్కా మసీదును సందర్శించారు.
చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ తో కలిసి ఆయన మసీదు ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా రంజాన్ మాసంలో ప్రార్థనల కోసం విచ్చేసే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు, పురానీ హవేలీలోని కొత్వాల్ హౌస్లో ముస్లిం మత పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. నెల రోజుల పాటు కొనసాగే రంజాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై వారితో సుదీర్ఘంగా చర్చించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎస్ఏం విజయ్ కుమార్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.




