అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మత్తుపదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు.
పురానాపూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం వరకు కొనసాగింది. గోల్కొండ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణ గౌడ్, కుల్సుంపురా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. తిరుపతి పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ర్యాలీలో ఇన్స్పెక్టర్లు, అదనపు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బందితో పాటు స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
మత్తుపదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు వివరించారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్తుపదార్థాల నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టవచ్చని, సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని వెల్లడించారు.
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుపదార్థాల సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని మంగళ్హాట్ పోలీసులు ప్రజలను కోరారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
