హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్స్కు చిన్నారులు బానిసలవుతూ ఆర్థిక, మానసిక సమస్యలకు గురవుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేసింది.
ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వస్తున్న అనేక ఫిర్యాదుల వెనుక హ్యాకింగ్ కంటే ఎక్కువగా పిల్లలు ఆన్లైన్ గేమ్స్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల బ్యాంక్ కార్డులు, యూపీఐ వివరాలను వినియోగిస్తున్న ఘటనలే ఉన్నాయని సీపీ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా చిన్నారులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆన్లైన్ గేమ్స్ ద్వారా అపరిచితులతో పరిచయాలు పెంచుకుని, సోషల్ మీడియా ద్వారా వారితో సంబంధాలు కొనసాగించడం వల్ల చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కొంతమంది మైనర్ బాలికలు గేమింగ్ పరిచయాల కారణంగా ఇళ్లను వదిలి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనలు దీనికి ఉదాహరణగా నిలిచాయని తెలిపారు.
10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులు గేమింగ్లో అధిక సమయం గడుపుతూ చదువు, ఆరోగ్యం, సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. గేమ్స్లోని రేర్ ఐటమ్స్, ఎలైట్ పాస్లు, వర్చువల్ రివార్డ్స్ కోసం పిల్లలు కుటుంబ సభ్యులకు తెలియకుండా డబ్బు ఖర్చు చేస్తున్నారని వివరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ‘గేమింగ్ డిజార్డర్’ ప్రస్తుతం చిన్నారుల్లో పెరుగుతున్న మానసిక సమస్యగా మారుతోందని తెలిపారు. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, నిద్రలేమి, కోపం, చదువులో వెనుకబాటు, సామాజిక దూరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించారు.
పిల్లల భద్రత కోసం మొబైల్ ఫోన్లలో సేవ్ చేసిన బ్యాంకింగ్ వివరాలను తొలగించడం, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ భద్రత ఏర్పాటు చేయడం, పేరంటల్ కంట్రోల్స్ వినియోగించడం, ఫోన్ వినియోగ సమయాన్ని పరిమితం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
“ఆన్లైన్ గేమింగ్ను పూర్తిగా వ్యతిరేకించడం కాదు. అయితే అది వినోదానికి మాత్రమే పరిమితమవ్వాలి. తల్లిదండ్రులు ‘Monitor, Mentor, Motivate’ అనే త్రిసూత్రాన్ని పాటిస్తూ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలి. ‘Think Before You Click, Even While You Play’ అనే సందేశాన్ని చిన్నారులకు చేరవేయాలి” అని సీపీ సజ్జనర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
