
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XI విడతలో జిల్లా వ్యాప్తంగా 99 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో 03 సబ్ డివిజన్ లలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇందులో భాగంగా జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్- 11 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో 99 మంది బాలకార్మికులను గుర్తించి కాపాడడం జరిగిందనీ తెలిపారు. ఇందులో 88 మంది మగ పిల్లలు మరియు 11 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. వీరినoదరినీ వారి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 61 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని,బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ -XI లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఈ సందర్బంగా ఎస్పీ అభినందించారు.