Breaking News

వార్షిక తనిఖీలలో సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి సబ్-డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలోని రికార్డులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచారాలు, డౌరీ డెత్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సమగ్ర విచారణ నిర్వహించాలని సూచించారు.

ప్రతి నెల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించి, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్‌హెచ్‌ఓలకు మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు.

అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబానికి ‘చేయూత’ కింద రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన జిల్లా ఎస్పీ

ప్రతి రికార్డు సీసీటీఎన్ఎస్‌లో నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని, తనిఖీలకు సంబంధించిన విజిటింగ్ కాపీలను జిల్లా పోలీసు కార్యాలయానికి సకాలంలో పంపించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తనిఖీలలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *