నల్గొండ, జూన్ 16: పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పేర్కొన్నారు. నకిరేకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కుటుంబానికి ‘చేయూత’ పథకం కింద రూ.2 లక్షల ఆర్థిక సహాయ చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
మృతుడి సతీమణి శ్రీమతి కళావతికి చెక్కును అందించి పరామర్శించిన ఎస్పీ, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కుటుంబం కూడా పోలీస్ కుటుంబమేనని అన్నారు. విధి నిర్వహణలో లేదా అనారోగ్య కారణాలతో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవడం శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయం, పెన్షన్తో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని, అవసరమైన ప్రతి సందర్భంలో పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏఎస్ఐ వెంకటేశ్వర్లు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలందించారని, ఆయన సేవలను పోలీస్ శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి భవిష్యత్తుకు పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
