ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలు
సంగారెడ్డి: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అంశాలపై స్థానిక ఎస్హెచ్ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
