గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక వికలాంగ మహిళను పోలీసులు సురక్షితంగా రక్షించి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20 సాయంత్రం సుమారు 5:50 గంటల సమయంలో జోషివాడి ప్రాంతంలో ఒక మహిళ బట్టలు లేకుండా తిరుగుతున్నట్లు గోషామహల్ ఎస్ఐ లక్ష్మయ్యకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు విమల, దివ్య, హోంగార్డ్ రేవణ స్వామి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ సదరు మహిళ స్థానిక కాలనీవాసుల ఇంటి వద్ద దుస్తులు లేకుండా కూర్చొని ఉండటాన్ని గమనించిన మహిళా సిబ్బంది, కాలనీవాసుల సహాయంతో ఒక చీరను సేకరించి ఆమెకు గౌరవప్రదంగా కప్పించారు. అనంతరం విచారించగా, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె తన పేరు, చిరునామా వివరాలు చెప్పలేకపోయింది.
స్థానికంగా ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో, మహిళ భద్రత దృష్ట్యా ఆమెను మెడలో ఉన్న బంగారు గొలుసుతో సహా గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం గుర్తింపు కోసం ఆమె ఫోటోను వివిధ పోలీస్ సమాచార గ్రూపుల్లో పంపించారు.
ఈ క్రమంలో హోంగార్డ్ రేవణ స్వామి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి తప్పిపోయిన రోగుల వివరాలు సేకరించగా, అక్కడి నుంచి ఒక మహిళ కనిపించకుండా పోయినట్లు తెలిసింది. ఆ వివరాలు ఈమెతో సరిపోవడంతో, వెంటనే ఆమె కుమారుడిని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.
తగిన ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, సదరు మహిళను ఆమె బంగారు గొలుసుతో సహా సురక్షితంగా కుమారుడికి అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళకు రక్షణ కల్పించి కుటుంబంతో కలిపిన గోషామహల్ పోలీస్ సిబ్బందిని స్థానిక ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ వివరాలను గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. శ్రవణ్ కుమార్ వెల్లడించారు.
