Breaking News

పి.ఏ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం, చిలకమర్రి గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు..

పి.ఏ.పల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చిలకమర్రి ధాన్యం నిల్వ గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వ ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, రైతులకు చెల్లింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రైతులు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోమ్ గార్డ్ కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు నుండి మిల్లింగ్ వరకు ప్రతి దశలో పారదర్శకత, సమయపాలన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్, ఎస్ఐ నరసింహ, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *