ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మరియు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి కూడా తీవ్ర హానిని కలిగిస్తుందని తెలిపారు.
ముఖ్యంగా యువత చెడు స్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
అలాగే చదువుపై దృష్టి కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసినప్పుడు స్పష్టంగా “కాదు” అని చెప్పాలని, చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 100 లేదా 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే విజయాన్ని సాధించగలరని తెలిపారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
అనంతరం డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
