అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రమోషన్లు మరియు నకిలీ పెట్టుబడి పథకాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ కఠిన చర్యలు చేపట్టి గణనీయమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రత్యేక డిజిటల్ పర్యవేక్షణలో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై 184 సోషల్ మీడియా ప్రొఫైల్స్ను గుర్తించి తొలగించారు.
ఈ ప్రొఫైల్స్ భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వివిధ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు మరియు నకిలీ పెట్టుబడి వెబ్సైట్లను ప్రచారం చేస్తూ 801 పెయిడ్ ప్రకటనలను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని, భారీ బోనస్లు, రెఫరల్ కమిషన్లు, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
ఇక కొన్ని ప్రొఫైల్స్ ఐపీఎల్ అంచనాలు, రెఫరల్ లింకులు, ప్రముఖుల పేర్లతో డీప్ఫేక్ వీడియోలు ఉపయోగించి ప్రజలను అక్రమ బెట్టింగ్ మరియు మోసపూరిత పెట్టుబడి పథకాల వైపు మళ్లించే ప్రయత్నం చేశాయని వెల్లడించారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుర్తించిన మొత్తం 184 ప్రొఫైల్స్ను సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు నివేదించి తొలగించారు. నిబంధనల ఉల్లంఘనలపై నిర్వాహకులపై ఏప్రిల్ నెలలో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
నిరంతర సైబర్ పెట్రోలింగ్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్, 1903 పెయిడ్ ప్రమోషనల్ ప్రకటనలను గుర్తించి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, అనుమానాస్పద పెట్టుబడి లింకులు, ప్రముఖుల పేర్లతో వచ్చే డీప్ఫేక్ వీడియోలను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఏదైనా మోసపూరిత ఆన్లైన్ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
